ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్, బాల్కొండ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి భుజంగరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్లందరూ తమకు అందజేసిన ఓటరు ధృవీకరణ ఫారాలను పూర్తిగా నింపి, వీలైనంత త్వరగా సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ లు) కు అందజేయాలని సూచించారు. ఏర్గట్ల మండలంలో ఇప్పటివరకు సుమారు 75 శాతం ఓటరు ఫారాలను బీఎల్ఓ లు సేకరించగా, అందిన ఫారాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. ఇంకా మిగిలిన 25 శాతం మంది ఓటర్లు వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లోగా తమ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న బీఎల్ఓ లకు ఫారాలను తప్పనిసరిగా అందజేసి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల తహసీల్దార్ జె. మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ లు), పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.