. . . టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి
హైదరాబాద్, బతుకమ్మ :
తనపై ఓ న్యూస్ చానల్ లో వస్తున్న కల్పిత కథనాలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దని, సమన్వయంతో ఉండాలని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన పార్టీ కాంగ్రెస్ అని, పత్రిక స్వేచ్ఛను గౌరవిస్తామని, మన పనితీరును నిర్ణయించాల్సింది క్యాడరేనని అన్నారు. ఒక న్యూస్ చానల్ లో నా పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఒక కల్పిత కథనం రోజంతా ప్రసారం చేశారని అవి మన పనితీరును కుంగతీయలేవన్నారు. అభూత కల్పనలతో, అసత్యాలతో వ్యక్తిగగతంగా అప్రతిష్టపాలు చేసే విధంగా కథనాలు ప్రసారం అయ్యాయని, అవి చూసిన కాంగ్రెస్ క్యాడర్ చాలా ఆవేశానికి, ఆగ్రహానికి గురయ్యారన్నారు. అయితే మనం, మన పార్టీ రాజ్యాంగ బద్దంగా పని చేసే విధానాన్ని అలవర్చుకున్నామని, మనకు పత్రిక స్వేచ్ఛ అన్న.. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న గౌరవం ఉందన్నారు. ఆ చానల్ లో ఏదో ప్రసారం చేసినంత మాత్రాన మనం హర్ట్ కావాల్సిన అవసరం లేదని, మన పని తీరును నిర్ణయించాల్సింది క్యాడర్ తప్ప మీడియా కాదన్నారు. అందువల్ల ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందకుండా ఆవేశానికి గురి కాకుండా ఓపికగా, ప్రశాంతంగా, సమన్వయం తో ఉండాలని, అన్నింటికీ కాలమే సమాధానం చెపుతుందని మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.