Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 2:00 pm Posted by : ramakrishna

అడవి జంతువుల, మానవుల రక్షణకు అటవి శాఖ చర్యలు 

నందిపేట్ (బతుకమ్మ): నందిపేట్ మండలం సిహెచ్ కొండూర్ అడవి ప్రాంతంలో పులి సంచరిస్తుందనే వార్తల నేపథ్యంలో అడవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అడవిలో అడవి జంతువుల సహజ వాతావరణాన్ని కాపాడడంతో పాటు మానవుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. నందిపేట్ మండల ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ మాట్లాడుతూ, పులి కదలికలను పర్యవేక్షించేందుకు అడవిలో అధునాతన కెమెరాలను గురువారం రోజున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కెమెరాలు ఆటోమేటిక్‌గా జంతువుల కదలికలను చిత్రీకరించడంతో పాటు వాటి సంచారంపై విశ్లేషణ చేసేందుకు ఉపయోగపడతాయని ఆయన వెల్లడించారు.  ప్రజలు అడవిలో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అడవి జంతువులకు ఎటువంటి హాని చేయకుండా ఉండాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి సంచారం గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారడంతో, భయాందోళనలను నివారించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రకృతి మరియు మానవుల మధ్య సమతౌల్యం సాధించడంలో ఈ చర్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సామాజిక వర్గాలు అభినందిస్తున్నాయి. పులి సంచారంపై వాస్తవాలు తెలుసుకుని సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల భద్రతకు అడవీ శాఖ కట్టుబడి ఉందని ప్రజలు ప్రశంసిస్తున్నారు.