Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 6:26 pm Posted by : ramakrishna

ఎస్సీ భవనంపై జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, బతుకమ్మ:

 

పిట్లం మండలం లోని బుర్నాపూర్ గ్రామంలో ఉన్న ఎస్సీ భవనంపై జరుగుతున్న ఆక్రమణ చర్యలను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత రాష్ట్ర, జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ పిట్లం మండలంలోని బుర్నాపూర్ గ్రామంలోని ఎస్సీ కమిటీ భవనం 1989 సంవత్సరంలో షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సి సమాజం కోసం మాత్రమే నిర్మించి అధికారికంగా అప్పగించినదని తెలిపారు. ఈ భవనం ఎస్సి కమిటీ దేనని స్పష్టం చేసేలా అప్పటి సర్పంచ్ జారీ చేసిన లీగల్ అఫిడవిట్ కూడా ఉన్నదని నాయకులు వివరించారు. అయితే ప్రస్తుతం కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ భవనాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దీని వల్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. ఇది కేవలం భవన సమస్య కాదని, ఎస్సి సమాజ హక్కులపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న చర్యలని తీవ్రంగా ఖండించారు. ఈ దౌర్జన్యాలు కొనసాగితే గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకు పాల్పడే వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వివరించారు. ఆక్రమణలకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు నిరోధక చర్యలు చేపట్టాలని వినతి పత్రం ద్వారా డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్, భూత్తి లక్ష్మణ్, కనగోల్ల రాములు, ప్రకాష్, బాబు రాజు, బాలరాజ్, బాబు, మొగులయ్య, మహిపాల్, భాస్కర్, రమేష్, పండరి, పవన్, తదితరులు పాల్గొన్నారు.