. . . పీడీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల్ రాజ్
బోధన్, బతుకమ్మ :
చందూర్లోని బీసీ బాలుర వసతిగృహ వార్డెన్పై తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ (పీడీఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల్ రాజ్ అన్నారు. ఈ మేరకు బుధవారం బోధన్ ఆర్డీఓ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీన వసతి గృహ వార్డెన్ కల్పలత విద్యార్థులపై సిగరెట్లు తాగుతున్నా రంటూ తప్పుడు ఆరోపణలు చేసి, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు సుమారు 10 మంది విద్యార్థులపై దౌర్జన్యంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు తెలిపారు. విద్యార్థులపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేసి వారిని ఇబ్బందులకు గురిచేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ పీడీఎస్ఎఫ్ నాయకులు పి.గణేష్, సన్నీ పాల్గొన్నారు.