నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బక్రీద్ పండుగ సందర్భంగా నగరంలో చేపట్టాల్సిన పారిశుధ్య, తాగునీరు, విద్యుత్, ప్రజా సౌకర్యాల ఏర్పాట్లపై నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పండుగ రోజుల్లో నగరంలోని మసీదులు, ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. చెత్త సకాలంలో తొలగింపు, తాగునీటి సరఫరా నిరంతరంగా అందుబాటులో ఉంచడం, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దానితోపాటు పశువుల అక్రమ రవాణా నిరోధించడానికి సహకరించాలని కోరారు. అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి బక్రీద్ పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని అదనపు కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఎసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పశుసంవర్ధక శాఖ ఏడి, విద్యుత్ శాఖ ఈఈలు, డీఈఈలు, ఏఈలు, ఏఎంసి అధికారులు పాల్గొన్నారు.
