Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 6:17 pm Posted by : ramakrishna

శిక్షణతోనే లక్ష్యసాధన సాధ్యం

 

. . . ట్రైనీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఎం. ఆనంద్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎస్‌సీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న శిక్షణ, అధ్యయన వనరులను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవాలని ట్రైనీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఎం. ఆనంద్ కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌సీ స్టడీ సర్కిల్‌లో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన మెలకువలను అభ్యర్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. దేవిదాస్ సక్పాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, సివిల్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయాన్ని అందుకోవాలంటే స్పష్టమైన లక్ష్యం, క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర సాధన అత్యంత కీలకమని అన్నారు. ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా చదువుతూ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధించవచ్చని అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తమ సందేహాలను ఆయనతో పంచుకోగా, వాటిపై ఆనంద్ కుమార్ సమగ్రంగా స్పందించి విలువైన సూచనలు, సలహాలు అందించారు. ఆయన మార్గదర్శకత్వం పోటీ పరీక్షల సన్నద్ధతకు ఎంతో ఉపయోగపడిందని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. అనంతరం స్టడీ సర్కిల్ సిబ్బంది ట్రైనీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఎం. ఆనంద్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్టడీ సర్కిల్ అధికారులు, సిబ్బంది, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

 

Achieving goals is possible only through training.