. . . రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని రాష్ట్ర రవాణా, బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం నిజామాబాద్ శివారులోని సుగుణ గార్డెన్స్ లో పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్-అలైవ్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎం.డీ నాగిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారని, ఎవరికివారు తమవంతు బాధ్యతగా భావిస్తూ ట్రాఫిక్ రూల్స్ ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హితవు పలికారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని, తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ చలానాలు విధించినా, ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వ యంత్రాంగం ఎంతటి కఠిన చర్యలు చేపట్టినా కూడా, ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రానంతవరకు రోడ్డు ప్రమాదాల పరిస్థితిలో మార్పు రాదని అభిప్రాయపడ్డారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్-అలైవ్ లో భాగంగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని గుర్తు చేశారు.

ఇదిలాఉండగా, నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే కొత్త బస్ డిపో రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రతిరోజూ 10వేల బస్సులు సుమారు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ, 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవాణా శాఖ పరంగా కూడా చెక్ పోస్టులు ఎత్తివేయడం వంటి అనేక నూతన సంస్కరణలను అమల్లోకి తెచ్చామని గుర్తు చేశారు.
రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలలో మన దేశంలో ప్రతి ఏటా లక్షా 50 వేల మంది, రాష్ట్రంలో 7వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వీటిలో సుమారు 45శాతం వరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను విధిగా పాటించి ప్రమాదాలకు నియంత్రించేందుకు కృషి చేయాలన్నారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్యలు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్ చేయడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటోలలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోందని అన్నారు. అతివేగాన్ని మానుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎంతో అప్రమత్తతో వాహనాలు నడపాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బాధితులు వెల్లడిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. అతి వేగం, అజాగ్రత్తగా వాహనాలు నడిపి తమ లాంటి దుస్థితిని కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేయడం అందరినీ ఆలోచింపజేసింది. రహ్ వీర్, పీ.ఎం రాహత్, హిట్ అండ్ రన్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటు, ప్రోత్సాహకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు వీలుగా రూపొందించిన గోడ ప్రతులను, కర పత్రాలను మంత్రి ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, డాక్టర్ కవితా రెడ్డి, డీటీసీ దుర్గా ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
