వెబ్ డెస్క్, బతుకమ్మ :
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం టీఎస్పీడీసీఎల్ డిప్యూటీ ఇంజినీర్ వెంకట రమణకు చెందిన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్లోని కొత్తగూడలో ఉన్న మీనాక్షి స్కై లౌంజ్ అపార్ట్మెంట్లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల సందర్భంగా నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, ఇతర ఆర్థిక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు లేదా ఆస్తుల విలువపై ఏసీబీ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
