. పక్షవాతం బారినపడినా బెదిరింపులు
. మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఫైనాన్స్ వేధింపులకు ఓ వ్యక్తి బలయ్యాడు. నగర శివారులోని నెహ్రూనగర్ కు చెందిన షేక్ ఖయ్యూం(48) మూడేళ్ల క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఇంటిని మార్టిగేజ్ చేసి లోన్ తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఖయ్యూం పక్షవాతం బారినపడ్డాడు. పక్షవాతంలో మూలనపడిన సదరు వ్యక్తిని ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు వదలలేదు. కిస్తీలు కట్టనిపక్షంలో ఇంటిని జప్తు చేస్తామని ఫైనాన్స్ కు చెందిన వ్యక్తులు బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఖయ్యూం ఈనెల 16వ తేదీన ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అశోక్ సాగర్ గట్టుపైన ఖయ్యూం చెప్పులు, చొక్క కనిపించడంతో గాలింపు చర్యలు చేపట్టడంతో ఖయ్యూం మృత దేహం లభించింది. ఖయ్యూంకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేదు
ప్రైవేట్ ఫైనాన్స్ కపెంనీల్లో పనిచేస్తున్న రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డూఅదుపుల లేకుండాపోతోంది. ఈఎంఐలు చెల్లించని వ్యక్తికి ఓ వైపు ఫైనాన్స్ సంస్థలు ఫైన్ ల మీద ఫైన్ లు విధిస్తుండగా, మరోవైపు రికవరీ ఏజెంట్లు కంపెనీ ఫోన్ నంబర్లతోపాటు తమ వ్యక్తిగత నంబర్లతో ఫోన్ లు చేస్తూ వేధిస్తున్నారు. లోన్ తీసుకునేప్పుడు అంతా చట్ట ప్రకారం(నిబంధనలు) జరిగినా రికవరీ ఏజెంట్లు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఇళ్లలోకి వెళ్లడం, తమకు ఇష్టమొచ్చిన సమయంలో ఫోన్ లు చేసి బూతు మాట్లాడుతుండడంతో రుణగ్రస్తులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఓ ప్రముఖ ఫైనాన్స్ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్లపై ఇప్పటికే అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంపెనీలో వివిధ రకాల రుణాలు పొందిన వారు ఈఎంఐ తిరిగి చెల్లించని పక్షంలో ఫైన్ లు విధిస్తున్నప్పటికీ రికవరీ ఏజెంట్లు మాత్రం ఇష్టారితీన మాట్లాడుతూ రుణగ్రస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లు వ్యక్తిగత దూషణకు దిగుతుండడంతో వినాయక్ నగర్ లోని ఆ ఫైనాన్స్ సంస్థ కార్యాలయానికి వెళ్లేందుకు రుణగ్రస్తులు ఏకమవుతున్నారు.