Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 2:23 pm Posted by : ramakrishna

తెయూ  అక్రమ నియామకాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ యూనివర్సిటీలో 2012లో జరిగిన అక్రమ నియామకాలపై  సమగ్ర దర్యాప్తు జరిపించాలని  ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. అలాగే అక్రమార్కులకు అండగా ఉంటున్న ప్రస్తుత వీసీ పై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలన్నారు. ఈమేరకు సోమవారం   జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012 సంవత్సరంలో నాటి వి.సి, రిజిస్టర్, ఎలాంటి నియమ, నిబంధనలు పాటించకుండా దొడ్డి దారిన తమకు నచ్చిన వ్యక్తులకు నియమకాలు కల్పించారన్నారు. ఈవిషయమై  హైకోర్టును ఆశ్రయిస్తే , సుదీర్ఘంగా విచారించి ఈ నియామకాలు అక్రమంగా జరిగినవన్నీ తేల్చి వాటిని రద్దు చేస్తూ, ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.  ప్రస్తుత వీసీ వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి. వాళ్లను యథావిధిగా  కొనసాగిస్తూ,   జీతభత్యాలు చెల్లించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు.  అవినీతికి అడ్డాగా  తెలంగాణ యూనివర్సిటీ మారిందని, అధికారులు ఎడాపెడా అక్రమార్జన ధ్యేయంగా పనిచేస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆయన ఆరోపించారు.  ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపించి దానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, దుర్వినియోగమైన కోట్ల రూపాయలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు కారణమైన వారిని గుర్తించి పూర్తిగా సర్వీసు నుంచి రిమూవ్ చేసి  జైలుకు పంపాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి. నాగరాజు, జవారి రాహుల్, ఆర్. రాజన్న, బి.రవీందర్ గౌడ్,  ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

 A thorough investigation should be conducted into the illegal appointments of Te U.