మనసు మార్చుకున్న దొంగ

సదాశివనగర్, బతుకమ్మ: గుడిలో నుంచి అమ్మవారి వెండి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దొంగ మూడురోజుల తరువాత దానిని యథాస్థానంలో తెచ్చిపెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండలం యాచారం తండాలో చోటు చేసుకుంది. సేవాలాల్ జగదాంబ ఆలయంలోని అమ్మవారి వెండి విగ్రహాన్ని మూడు రోజుల క్రితం దుండగుడు ఎత్తుకెళ్లాడు. రోజూలాగే బుధవారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన పంతులుకు అక్కడ విగ్రహం కనిపించింది. దీంతో ఆయన గ్రామస్తులకు విషయం తెలుపగా అంతా ఆశ్చర్యపోయారు. అమ్మవారే దొంగ మనసును మార్చేశారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.