కామారెడ్డి, బతుకమ్మ : తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్ కాలనీకి చెందిన మెరికాడి లక్ష్మీ, పోశెట్టి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతరు ఉన్నారు. కూతురు మెరికాడి సంజన స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సంజన పాఠశాలకు సరిగా రావడం లేదని, సరిగా చదవడం లేదని పాఠశాల ఉపాధ్యాయులు తల్లికి ఫిర్యాదు చేశారు. దీంతో సంజనను తల్లి సరిగా చదవకపోతే పదో తరగతి పాస్ కాలేవని, చదువుపై శ్రద్ధ పెట్టాలని చెప్పి బయటకు పనికి వెళ్లింది. మనస్థాపానికి గురైన సంజన తన ఇంట్లోని ఇనుప రాడ్డుకు ఉరేసుకుని చనిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.