. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
రుద్రూర్ బతుకమ్మ :
ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఎంతో అవసరమని బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న జనరల్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి స్థానిక మండల నాయకులు భూమిపూజ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా కేవలం బాన్సువాడ నియోజకవర్గం లో 11వేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేశామన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించాలనే సంకల్పంతో బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ఆయన వివరించారు. పేదవానికి ఇల్లు, విద్య, వైద్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అదే విధంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీతా రామరాజు, తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్, ఏఈ పవన్, ఉమ్మడి మండలాల ఏఎంసి చైర్మన్ సురేష్ బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, మాజీ ఎంపిటిసి అనిల్ పటేల్, రాయకూర్ మాజీ విండో సెక్రటరీ గంగారాం, నాయకులు అక్కపల్లి నాగేందర్, పట్టేపు రాములు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.