మెండోరా, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి ప్రోత్సాహం లో భాగంగా సదమస్తుల రాములు చారిటబుల్ ట్రస్ట్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ అన్నారు. చారిటబుల్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని సుంకేట్ పాఠశాలలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ. 1000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 500 అలాగే స్వయంకృషితో ముందుకు దూసుకు వస్తున్న వారిని సైతం వదలకుండా వారికి రూ.1000 చొప్పున అందించి విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు. సదమస్తుల రాములు వారి కుటుంబ సభ్యుల దాతృత్వ గుణానికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.