నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కార్మిక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్స్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ముత్తెన్న, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నా, ఇప్పటికీ కార్మిక మంత్రిని నియమించలేదన్నారు. కార్మిక శాఖను ముఖ్యమంత్రి వద్దే ఉంచుకోవడంతో కార్మికుల సమ్మస్యలు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలవడానికి ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. తద్వారా అనేక సమస్యలు పెండింగులో ఉంటున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రోజువారి బిజీ షెడ్యూల్ వల్ల కార్మిక శాఖపై కూడా దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట వస్తున్నదన్నారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే కార్మిక శాఖ మంత్రిని నియమించాలని, కార్మిక శాఖ సమీక్ష సమావేశం నిర్వహించి, పెండింగులో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీయుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.రమేష్, జిల్లా నాయకులు కిషన్, మురళి, విటల్, కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు.
