- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, బతుకమ్మ : ఆరోగ్యకర ప్రారంభంతోనే ఆశాజనక భవిష్యత్తు ఉంటుందని జిల్లా మెజిస్ట్రేట్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమం పై ముద్రించిన కరదీపికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్యకర ప్రారంభాలు ఆశాజనక భవితవ్యాలు అనే అంశం ద్వారా సంవత్సరం పొడవునా మాత మరియు నవజాత శిశు ఆరోగ్యం పై పెట్టుబడి పెట్టడం. మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించడం, నివారించదగ్గ మాతృ మరణాలపై దృష్టి సారించడం, గర్భిణీ స్త్రీ సమయంలో అందుతున్న సేవలు, ప్రసూతి సమయం లో సేవలు, ప్రసవానంతర సేవలపై దృష్టి సారించి ప్రత్యేక శ్రద్ధ వహించడం. అత్యంత ప్రమాదకర గర్భిణీ స్త్రీలను ముందే గుర్తించి బర్త్ ప్లానింగ్ నిర్వహించడం ద్వారా నివారించదగ్గ మాతా శిశు మరణాలను తగ్గించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్, అదనపు కలెక్టర్ రెవిన్యూ యస్ కిరణ్ కుమార్, డి ఆర్ డి ఓ సాయ గౌడ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్, డిపిఓ శ్రీనివాస్, ఏసీపి రాజా వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ ,డి ఈ డాక్టర్ వెంకటేష్, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మాతా శిశు ఆరోగ్యం పైఅవగాహన సదస్సు
నిజామా బాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం మాలపల్లి నందు జరిగిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి మహిళ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందించే ఉచిత ఆరోగ్య సేవలను ఉపయోగించుకోవాలని, ప్రతి మహిళ పోషకాహరం లోపానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రక్తహీనతను అధిగమించాలని, గర్భిణీ సమయంలో ప్రభుత్వ వైద్యుల చేత కనీసం ఆరు చెకప్ లు చేయించుకోవాలని, ప్రమాదకరమైన లక్షణాలు గల గర్భిణీలు ముoదు జాగ్రత్తగా హైపర్ టెన్షన్ కు గురికాకుండా జాగ్రత్త పడాలని, యోగా మెడిటేషన్ లాంటివి చేస్తూ సాధారణ కాన్పుకై వేచి ఉండాలని కోరారు. మాతా శిశు మరణాలు జరగకుండా వైద్య సేవలను అందించాలని ముఖ్యంగా నివారించదగ్గ మాతా శిశు మరణాలను తగ్గించాలన్నారు. సంవత్సరం పొడవునా మాతా శిశు సేవలు, నవజాత శిశు సేవలను పెంచుతూ అవగాహన కలిగించాలన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సహిస్తా పర్వీన్, డి పి హెచ్ ఎన్ ఓ స్వామీ సులోచన, డి హెచ్ ఈ వెంకటేశ్వర్లు, శ్యామల, షాదుల్లా, గర్భిణీ స్త్రీలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
