- మద్యం సేవించడం, గంజాయి, పేకాటకు అడ్డా
- పట్టించుకోని పోలీసులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కాలేజ్ మైదానం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. నిత్యం మద్యం సేవించడం, పేకాట ఆడడం, తాగుతూ గొడవలు పడుతున్నారు. కానీ మూడవ టౌన్ పోలీసులు మాత్రం నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పేకాటనే కాకుండా గంజాయి తాగుతూ గొడవలను సృష్టిస్తున్నారు. స్థానిక ప్రజలతోపాటు కళాశాలకు వెళ్లే విద్యార్థినిలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రాంతం గుండా వెళ్లాలంటేనే మహిళలు, చిన్నారులు, పెద్దవాళ్లు భయపడుతున్నారు. ఈ విషయంలో ఎవరైనా స్పందిస్తే వారిపై దాడులకు సైతం దిగుతున్నారు. దానికితోడు పోలీసులు పట్టించుకోకపోవడంతో రోజురోజుకు మితిమీరిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాంతంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రజలు వస్తూ వెళుతుంటారు. ఇలాంటి సమయంలో ఏదైనా తప్పు జరిగితే బాధ్యులు ఎవరు అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇలాంటి గొడవలు జరగకుండా, పేకాట ఆడకుండా, గంజాయి సేవించకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు.