నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తుమందు ఇంజిక్షన్లు ఇచ్చి ఆవులకు ఎత్తుకెళ్తున్న ముఠా గుట్టురట్టు చేసినట్లు సీసీఎస్ ఇన్స్ పెక్టర్ సురేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఉండే ఆవులను మత్తు మందు ఇచ్చి ఇన్నోవాలో ఎత్తుకెళ్తున్నారనే సమాచారంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేశ్ తన సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలేష్, నరేశ్లతో కలిసి నిఘా ఉంచారు.

అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూర్లో ఆరుగురు నిందితులు సయ్యద్ ఉమర్, సయ్యద్ ఆమేర్, అబ్దుల్ కలామ్, సయ్యద్ షోయబ్, సమీర్ అలీలను పట్టుకున్నారు. అనంతరం దెగ్లూర్ పోలీసులకు అప్పగించారు. నిందితులు ఇన్నోవా వాహనానికి ప్రెస్, పోలీస్ స్టిక్కర్ అతికించి అర్ధరాత్రి ఆవులు చోరీకి పాల్పడేవారు. వాహనానికి స్టిక్కర్ ఉండడంతో ఇన్నాళ్లు ఎవరికీ చిక్కలేదు. సీసీ టీవీ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.
