- ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే ప్రజా ప్రభుత్వమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రేషన్ కార్డులను శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా గాంధారి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆకలి తీరుస్తోంది. గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీచేసినప్పుడు ప్రజలు ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు నాణ్యమైన సన్న బియ్యం అందించడంతో ప్రతి కుటుంబం ఉపయోగం పొందుతోంది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, అదనపు కుటుంబ సభ్యుల పేర్లను జతచేయడం ద్వారా పేదల జీవితాలలో మార్పు తీసుకువస్తోంది.” రేషన్ కార్డు పొందిన దశనుంచే సన్న బియ్యం పొందవచ్చని వెల్లడించారు. కార్డు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది,” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ, గాంధారి ఏఎంసీ చైర్మన్, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట,గాంధారి మండల సీనియర్ నాయకులు, లబ్ధిదారులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.