- ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళా సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. జూలై 9 సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఐద్వా నిజామాబాద్ జిల్లా కమిటీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ దేశంలో విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి మహిళలకు రక్షణ ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల అణిచివేతకు గురవుతున్నారని అన్నారు. నిరుపేదలకు రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కార్మిక హక్కులను కుదించి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడడమే కాకుండా మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని తెలిపారు. అలాగే ప్రతి రంగంలో పని చేస్తున్న మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మగవారితో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధి కూలి రేట్లు పెంచాలని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాకు ధర ఇవ్వాలని, ప్రతి రంగంలో పనిచేస్తున్న వారికి ఇన్సూరెన్స్ బీమా పథకాలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఐద్వా ఆధ్వర్యంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, యశోద, రేఖ, సంగీత, సంపత, లక్ష్మీ, జ్యోతి, ఇతర శాఖ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.