. . . ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.మల్లికార్జున్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
హమాలీ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర హమాలీ కార్మికుల చట్టం తీసుకురావడంతో పాటు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఐఎఫ్ టీయూ జిల్లా అధ్యక్షుడు డి.మల్లికార్జున్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నిజామాబాద్ కార్మిక శాఖ కార్యాలయం (లేబర్ ఆఫీస్) ఎదుట తెలంగాణ ప్రగతిశీల హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులు రోజురోజుకు ఉపాధి కోల్పోతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని అన్నారు. హమాలీల జీవనాధారం పూర్తిగా రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుందని, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో గతంలో మూడు నుంచి నాలుగు నెలల పాటు లభించే సీజనల్ ఉపాధి ప్రస్తుతం నెల రోజులకే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, గోదాముల్లో స్థానిక హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన చోట గోదాం లేబర్ కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల వలస కార్మికులను అధిక సంఖ్యలో నియమిస్తూ స్థానిక కార్మికులను పనికి దూరం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల శ్రమదోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, గోదాములు, పరిశ్రమల్లో స్థానిక హమాలీ కార్మికులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి కార్మికుడికి ప్రభుత్వ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరారు. ఆ గుర్తింపు కార్డు ద్వారా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని సూచించా రు. అలాగే 50 సంవత్సరాలు దాటిన హమాలీ కార్మికులకు నెలకు రూ.10,000 పెన్షన్ మంజూరు చేయాలని, ప్రతి కార్మికుడికి గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు, ప్రభుత్వ గోదాముల్లో పనిచేసే హమాలీ కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నాలో కోల్డ్ స్టోర్స్ హమాలీ యూనియన్ అధ్యక్షుడు గంగాధర్, లక్ష్మణ్, పసుపు డోల్ హమాలీ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు పండరి, సీడ్ కంపెనీ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుశాంత్, విజిటబుల్ హోల్సేల్ మార్కెట్ ముల్లె హమాలీ యూనియన్ అధ్యక్షుడు మచ్చ మోహన్, యూనియన్ నాయకులు మల్లేష్, పీరయ్య, రాములు, అంజి, రిక్షా పుల్లర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు, రైస్ హమాలీ యూనియన్ ప్రధాన కార్యదర్శి వకీల్, యూనియన్ నాయకులు అన్వర్, ముజామిల్, దాదు తదితరులు పాల్గొన్నారు.
