- రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని
నిజామాబాద్, బతుకమ్మ : రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, మొదటి, రెండవ విడతl నామినేషన్ల స్వీకరణ,దాఖలైన నామినేషన్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండవ విడత నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, మూడవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కూడా తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్సులు, శాంతిభద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో మొదటి, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, మొదటి దశ నామినేషన్ల పరిశీలన కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికలను స్వేచ్చాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయిలలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎన్నికలతో ముడిపడిన అంశాలపై వచ్చే ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు నవంబర్ 28న మొదటి రాండమైజేషన్ పూర్తి చేశామని, ఈ నెల 04న రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని, అవసరమైన బ్యాలెట్ బాక్సులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

