- ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క
కామారెడ్డి, బతుకమ్మ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క సూచించారు. కలెక్టరేట్ లో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంగళవారం జిల్లాస్థాయి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క. మాట్లాడుతూ వానాకాలం ప్రారంభమై దోమలు అధికంగా పెరిగి అవి కాటు వేయడం వలన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు త్వరగా వ్యాపించేందుకు ఇది సరైన సమయమని ఈ సమయంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండి గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. త్రాగునీరు కలుషితమైతే డయేరియా వ్యాపిస్తుందని త్రాగునీరు కలుషితం కాకుండా పైప్ లైన్ లను సరి చూసుకోవాలని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి త్రాగునీటి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి అందులో జిల్లా మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను చేర్చి పర్యవేక్షించాలని అన్నారు. ప్రతివారం రెండుసార్లు డ్రై డేగా నిర్వహించాలని అన్నారు.

దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జిల్లా లోపల వేరే వేరే ప్రాంతాల్లో సర్దుబాటు చేయాలని అన్నారు. హై రిస్క్ ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర మందులు, పాముకాటు, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని అన్నారు. ఎల్లారెడ్డి ఆసుపత్రికి గైనకాలజిస్ట్ డాక్టర్ ను కేటాయించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడుతాను అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇకనుండి పరుగెట్టాలని అన్నారు. ఇండ్లు నిర్మించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న నిరుపేద లబ్ధిదారులకు ఐకెపి ద్వారా ముందుగా రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు నిర్మాణం కొనసాగిన కొద్దీ అందించే పేమెంట్ పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, ఇసుక సరఫరాకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక రవాణకు ట్రాక్టర్ చార్జీలు లబ్ధిదారులకు భారం కాకుండా అధికారులు ఫిక్స్ చెయ్యాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టని వారు ఎందుకు కట్టడం లేదో జిల్లాలో 5 రోజులు ప్రత్యేక డ్రైవ్ చేసి తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వంను నమ్ముకొని లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. అదికారులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు గ్రూప్ పెర్పాటుచేసుకొని ఏ ఒక్క గ్రామంలో కూడా సమస్య రాకుండా త్రాగునీరు సరఫరా చెయ్యాలన్నారు.

అలాగే పట్టణాల్లో కూడా సరఫరా చెయ్యాలి. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరై టెండర్ స్థాయిలో ఉన్న రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చెయ్యాలని, ఇందిరా మహిళా శక్తి భవనం నవంబర్ లో ప్రారంభించేలా డే అండ్ నైట్ పనిచెయ్యాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలి. ఇవి పూర్తయితే మళ్ళీ మిగతా వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. 14 వేల 500 అంగన్వాడీ పోస్టులను త్వరలో ప్రభుత్వం భర్తీ చేయనున్నదని తెలిపారు. ఎరువుల కొరత లేకుండా వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడి జిల్లాకు అవసరమైన ఎరువులను సరఫరా చేయిస్తానన్నారు. పేదలను ఇందిరమ్మ ఇండ్లలోకి పంపించినప్పుడే ముఖ్యమంత్రి ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషిచేయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ సెట్కార్, జిల్లా కలెక్టర్ అశీష్ సాంగ్వన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు, మహిళా శిశు అభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాలరాజు, జిల్లా ఎస్పీ రజేష్ చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు ఎస్పీ చైతన్య, జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

