హైదరాబాద్, బతుకమ్మ : ఈ నెల 18న చోటు చేసుకున్న చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్లతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు ప్రతిపాదనలతో కమిటీ సూచనలు చేయనుంది. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారుల సమక్షంలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
