హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాజ్ భవన్లో చోరీ జరిగింది. అందులోని సుధర్మ భవన్ లో హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు రాజ్ భవన్ అధికారులు గుర్తించారు. ఈనెల 14న చోరీ జరగ్గా పంజాగుట్ట పోలీసులకు రాజ్ భవన్ అధికారులు ఫిర్యా దు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీపీ మోహన్ కుమార్ వెల్లడించారు. రాజ్ భవన్ లో పని చేసే ఓ మహిళ ఫొటోలను పొరుగు సేవల సిబ్బంది శ్రీనివాస్ మార్ఫింగ్ చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీనివాస్ ఫొటోల మార్ఫింగ్ కు ఉపయోగించిన కంప్యూటర్ లోని హార్ట్ డిస్క్ చోరీ చేశాడు. ఈఘటనపై రాజ్ భవన్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శ్రీనివాస్ ను అరెస్టు చేసినట్టు ఏసీపీ తెలిపారు.
