- మూడు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యం
- చెరువులో విగత జీవులుగా లభ్యమైన కల్లు బట్టి కార్మికులు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో కృత్రిమ కల్లు తాగి పలువురు ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే. బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కృత్రిమ రసాయన కల్లు తాగి 100 మంది వరకు ఆస్పత్రుల పాలయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో కల్లుబట్టిలో పనిచేస్తున్న బాల కార్మికులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. కామారెడ్డి మండలం క్యాసం పల్లి తాండ కు చెందిన తేజావత్ సాయికుమార్(15), భూక్య సురేష్(14) లు ముత్యంపేట కల్లుబట్టిలో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన బాలురు తిరిగి రాలేదు. గురువారం ఉదయం రాఘవపూర్ గ్రామంలోని చెరువులో సాయికుమార్, సురేష్ ల మృతదేహాలు నీటిపై తేలి ఆడాయి. బాలుర కుటుంబ సభ్యులు తమ పిల్లల మృతి పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
