కామారెడ్డి, బతుకమ్మ: ప్రజావాణి ఫిర్యాదులను వెంటవెంటనే పరిశీలించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 64 ఫిర్యాదులు అందగా, 27 రెవెన్యూ, 9 వ్యవసాయశాఖకు సంబంధించినవి కాగా, పౌరసరఫరాలు, విద్యశాఖలకు సంబంధించి ఒక్కోటి, వైద్యారోగ్యకు సంబంధించి మూడు, జిల్లా పంచాయతీ 10, మున్సిపల్ 7, సర్వే ల్యాండ్ రికార్డ్స్ రెండు, రోడ్లు భవనాలు, విద్యుత్ శాఖ, జిల్లా సంక్షేమాధికారికి సంబంధించి ఒక్కో ఫిర్యాదులు అందాయి. గత వారం వరకు 18,360 అర్జీలు అందగా, 17,752 మందికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించారని, 608 పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జెడ్పీ సీఈవో చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
