నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
గడిచిన 2 వారాలలో 471 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ తనిఖీలలో భాగంగా ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగిన తనిఖీలలో 471 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. వీరినందరిని సంబంధిత కోర్టులలో హాజరుపరచగా 433 మందికి 10,000 చొప్పున రూ. 43,30,000 జరిమానా విధించడం జరిగిందన్నారు. మిగిలిన 38 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరని కోరారు.