Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 2:34 pm Posted by : ramakrishna

వరల్డ్ లూపస్ డే సందర్భంగా రేపు నగరంలో ‘2కే రన్’

. ప్రముఖ రుమటాలజిస్ట్ గ్రీష్మ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వరల్డ్ లూపస్ డే సందర్భంగా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం 2కే రన్ నిర్వహించనున్నట్లు ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి రుమటాలజిస్ట్, నిజామాబాద్ రుమటాలజీ, ఆర్థరైటిస్ సెంటర్ వైద్యురాలు గ్రీష్మ, ప్రముఖ కార్డియాలజిస్ట్ రవి కిరణ్ తెలిపారు.

నగరంలోని నిజామాబాద్ రుమటాలజీ, ఆర్థరైటీస్ సెంటర్ లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. కీళ్లవాతం(ఆర్గరైటీస్)లో లూపస్ అనేది ప్రమాదకరమైనదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. లూపస్ అనేది ప్రాణాంతకమైనది కాకున్నప్పటికీ రోగనిరోధక శక్తిని దెబ్బ తీస్తుందని, పర్యావసనంగా అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కిడ్నీ, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం తదితర అవయవాలపై ప్రభావం చూపుతుందన్నారు.

లూపస్ అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అని, ఈ వ్యాధి బారిన పడినవారిలో దీర్ఘకాలిక జ్వరం, కారణం లేకుండా జ్వరం రావడం, రక్తహీనత, శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుందని, అలసట, ముఖంపై దద్దుర్లు వంటి తదితర లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఎక్కువగా 15 ఏళ్ల నుంచి 40 వయస్సు ఆడవారిలో కనిపిస్తుందన్నారు.

2కే రన్ కు ముఖ్య అతిథులుగా ఐఎంఏ అధ్యక్షుడు అజ్జ శ్రీనివాస్, సెక్రెటరీ విక్రమ్ రెడ్డి, ట్రెజరర్ రాజేందర్, వైద్యులు హాజరవుతారని, నగర ప్రముఖులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.

రుమటాలజిస్ట్ ను వీరు కలవాల్సిందే..
దీర్ఘకాలంగా కీళ్ల నొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వారు, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వారు, రుమటాయిడ్, సోరియాటిక్, ఇది వరకు ఆర్థరైటిస్ కు చికిత్స పొందిన వారు రుమటాలజిస్ట్ ను కలవాల్సిందేనని వైద్యురాలు గ్రీష్మ తెలిపారు. ఎముకలు, నరాల డాక్టర్లు, ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సు చేసిన వారు రుమటాలజిస్ట్ లు కారని స్పష్టం చేశారు. ఎండీ జనరల్ మెడిసిన్(ఫిజిషియన్) పూర్త చేసి మూడేళ్ల డీఎం సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన వారు మాత్రమే రుమటాలజిస్ట్ లు అని గ్రీష్మ స్పష్టం చేశారు.