Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2023, 7:24 pm Posted by : ramakrishna

మణిపూర్ ఘటనపై సుప్రీం హెచ్చరిక – ప్రధాని ఆగ్రహం

మణిపూర్ లో కుకీలు, మొయిటీల మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేపి చేసి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన మే 4నే జరిగినప్పటికీ దీని వీడియోలు మాత్రం నిన్న బయటికి వచ్చాయి. ఇవి కాస్తా వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రధాని మోడీ సహా సుప్రీంకోర్టు కూడా ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మణిపూర్లో రెండు నెలల క్రితం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దిగ్భ్రాంతికరమైన ఘటనపై నిశిత దర్యాప్తు జరిపి ఉరిశిక్షతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు. జాతి ఘర్షణలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు. ఉరిశిక్ష విధించే అవకాశంతో సహా నేరస్తులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
సమాజంలో ఇటువంటి హేయమైన చర్యలకు ఖచ్చితంగా చోటు లేదని తెలియజేయాలని సీఎం బీరేన్ సింగ్ పిలుపునిచ్చారు.ఇద్దరు మహిళలను ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన పురుషులు వివస్త్రను చేసి, నగ్నంగా ఊరేగించినట్లు చూపిస్తూ మే 4 నుండి వీడియో బయటికి రావడంతో విమర్శలు చెలరేగాయి. దీంతో సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. తీవ్రమైన అమర్యాద, అమానవీయ చర్యకు గురైన ఇద్దరు మహిళలను చూస్తుంటే నా హృదయం ద్రవిస్తోందని మణిపూర్ ముఖ్యమంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. వీడియో బయటికి వచ్చిన వెంటనే ఈ ఘటనపై మణిపూర్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మణిపూర్ మహిళల ఘటనపై ఈ ఉదయం పోలీసులు తొలి అరెస్టు చేశారు. పోలీసులు గుర్తు తెలియని సాయుధ వ్యక్తులపై తౌబల్ జిల్లాలోని నాంగ్పోక్ సెక్మై పోలీస్ స్టేషన్లో కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. బుధవారం ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటపడిన వెంటనే పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, తౌబాల్ జిల్లా నుంచి సూత్రధారిగా భావిస్తున్న ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఈ ఘటనను సిగ్గుచేటుగా అభివర్ణించారు. మహిళల భద్రతకు హామీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. 